వల్లభనేని వంశీకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు

  • విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు
  • గత ఏడాది జులైలో తనపై దాడి చేశారంటూ సునీల్ అనే వ్యక్తి ఆరోపణ
  • వంశీతో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఇప్పటికే 11 కేసుల్లో నిందితుడిగా ఉన్న వంశీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో కొత్తగా మరో కేసు నమోదైంది. గత ఏడాది జులై నెలలో తనపై వంశీ, ఆయన అనుచరులు దాడి చేశారంటూ సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
 
బాధితుడు సునీల్ ఇటీవల పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వల్లభనేని వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ, ఆయనతో పాటు మరో ఎనిమిది మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
 
కాగా, వల్లభనేని వంశీ ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్నారు. గతంలో ఓ టీడీపీ కార్యకర్త కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 16న అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయనపై వరుసగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 11 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన, 140 రోజుల పాటు జైలులో గడిపి బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో దాడి కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Vallabhaneni Vamsi
Vijayawada
Andhra Pradesh

More Telugu News